Sunday, May 9, 2021

శ్రీ సాయినాథ అష్టోత్తర శత నామావళి . " ఓం సర్వ మంగళ కరాయ నమః "

శ్రీ సాయినాథ అష్టోత్తర శత నామావళి .
" ఓం సర్వ మంగళ కరాయ నమః "
మంగళం అంటే శుభం .సర్వ జనులకు శుభం 
కలిగించేవాడు లేదా సర్వ మంగళకరంగా పర్యవసింప చేసేవాడు -అని అర్థం .శ్రీసాయిబాబా 
మాకు తల్లీ ,తండ్రి ,గురువు ,దైవం .అందుచేత 
ఆయన మనలను తల్లిగా ప్రేమించి ,తండ్రిలాగా 
దండించి ,గురువులాగా హితోపదేశం చేసి ,
దైవంలాగా ఆదుకొంటాడు .ఒకొక్కసారి ఆయన చేసింది కొంచం బాధాకరంగా కనిపించవచ్చు కానీ 
అది శుభప్రదము అయి తీరుతుంది .ఏది జరిగినా 
అది మన మంచికే భావించడం శ్రేయస్కరం .ఒక 
క్షణంలో చెడుగా కనిపించిన సంఘటన మరొక 
క్షణంలో మరొక క్షణంలో మహోపకారముగా 
పరిగణించటం మన నిత్య జీవితములో చూస్తుంటాము .పూర్వము ఒక రాజుగారి చేతి 
వేలు తెగి ఊడిపోయింది .మంత్రిగారు ఓర్పుగా 
" చింతించకండి మహా ప్రభో ! ఆంతా మన మంచికే " అని అన్నాడు .రాజు గారికి వళ్ళు మండి ,మంత్రి గారి ని జైలులో వేయించి ,ఆంతా 
నీ మంచికే " అనేసి వెళ్లిపోయాడు .రెండు రోజుల 
తరువాత రాజు గారు అడవికి వేటకు వెళ్లి కోయవాళ్ళ చేతిలో చిక్కాడు .వాళ్ళు ఒక అందమైన మనిషిని ,వాళ్ళ కొండ దేవతకు బలి 
ఇవ్వటానికి వెతుకుతున్నారు .మరి రాజుగారి చేతివేలు తెగిపొయి ఉండటం చూసి బలికి 
పనికిరాడని వదలివేశారు .రాజు గారు తిన్నగా 
జైలు దగ్గరకి వచ్చి " మంత్రీ ! నీవు చెప్పినట్లే 
జరిగింది .నా వేలు లెకపోవడమే నన్ను రక్షించింది 
అని అన్నాడు .మంత్రి చిరునవ్వుతో " మహరాజా ! అంతా మన 
మంచికే .ఈ జైలు శిక్ష నాకు పడకపోతే ,నేను 
మీతో నేను కూడా వచ్చేవాడిని .ఆ ఆటవికులు 
అన్నీ అంగాలు సరిగాఉన్న నన్ను బలి చేసేవాళ్ళు .చూశారా ! ఈ జైలు శిక్ష కూడా నా మంచికే వచ్చింది ." అని అన్నాడు .హేమాడ్ పంత్ 
రచించిన సాయిసచ్చరిత్రలోని దాము అన్నా తలపెట్టిన వ్యాపారాలు మాన్పించి ,నష్టాల నుండి 
కాపాడుట ,నాందేడు షాపుర్జీ వాడియాకు 12 మంది సంతానాన్ని ప్రసాదించి ,చివరకు నలుగురిని మిగిల్చి వైరాగ్యాన్ని పెంచడం -
ఇలాంటివే ఆ స్వామి చేసేది ఆంతా మంగళమే .
అది మనము చూడగలగాలి అంతే ! అట్టి మంగళ 
ప్రదునికి ఇవే నా ప్రణామములు .