Friday, February 16, 2024

నామామృతం

*నామామృతం.*

*భగవంతుని మహిమ అపారమైనది.*
 *ఆ పరమాత్మను అనునిత్యం స్మరిస్తూ ఉండటం మానవాళి కర్తవ్యం.*
*ఏ ఆపద వచ్చినా, ఏ కార్యం సానుకూలం కావాలన్నా, శుభం జరగాలన్నా పరమాత్మ అనుగ్రహం కావాలి.*
*మనిషి ఏదైనా కార్యం సాధిస్తే అంతా తన గొప్పే అనుకొంటాడు.*
*మనం ఎన్ని విజయాలు సాధించినా అవి ఆ పరంధాముని కటాక్షం అని గ్రహించాలి.*
*ఆ కటాక్షం సాధించడం కోసం ఆయనను ఆరాధించాలి.*

*ఆ ఆరాధన అనేక రకాలు.*

*వాటిలో సులభముగా చేయగలిగేది 'నామస్మరణ'.*
*సర్వకాల సర్వ అవస్థలలోను, ఏ పని చేస్తున్నా భగవన్నామం స్మరిస్తూ ఉండాలి.*
*అది మన నైతిక బాధ్యత.*

*కలి యుగంలో  నామజపం ప్రముఖమైనది. భగవంతుడు ఇంద్రియాలకు గానీ మనసుకు గానీ కనిపించడు. ఆయన అసంఖ్యాకమైన నామరూప భేదాలతో ఈ విశాల విశ్వమంతా విస్తరించి వికసించి విరాజిల్లుతున్నాడు.*
*బంగారం లాంటి లోహాలను అగ్ని దగ్ధం చేసిన విధంగా భక్తితో చేసిన భగవన్నామ సంకీర్తన సకల పాపాలను దగ్ధం చేస్తుంది.*

*అన్ని సమయాలలోను నిరంతరం నీవు నన్ను స్మరిస్తూనే నిత్య దైనందిన కార్యాలు నిర్వహించాలని గీతాశాస్త్రం ప్రభోధిస్తుంది.*

*నామ జప మహాత్యం వల్లనే ప్రహ్లాదుడు భక్త శిఖామణియై శ్రీహరి కృపకు పాత్రుడైయ్యాడు.*
*ప్రేమ పావని హనుమంతుడు నిరంతరం శ్రీరాముని నామ స్మరణ మహిమచేత ఆయన రూపాన్ని గుండెలలో నిలుపోకోగలిగేడు.*

*అజామిళుడు, గజేంద్రుడు లాంటి ఎందరో నామ స్మరణ చేసి ముక్తిని పొందారు.* *నిష్కామ భావంతో విధి విధానంగా భగవన్నామం జపించాలి. పరమాత్మునికి అనేక నామాలున్నాయి.*
*వాటిలో సాధకునికి ఇష్టమైన, శ్రద్ధ, నమ్మకం గల నామాన్ని స్వీకరించాలి. ఎవరి అభిరుచి, అనుభవం అభిమతానికి తగినట్లుగా వారు భగవంతుడి నామాన్ని స్మరిస్తునే ఉండాలి.*
*అలా స్మరిస్తూ ఆయన స్వరూపాన్ని చింతన చేయాలి.*

*ఓం శ్రీ సాయినాథాయ , ఓం శ్రీ సాయి రాం, ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త అని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ ఇలాగ ఏదో ఒక నామస్మరణ చేయాలి.*

*భగవంతుడి కంటే భగవన్నామమే సకల  ఫలదాయకమని భావం స్ఫురించేలా భద్రాద్రి రామదాసు 'రామా ! నీ రూపం కంటే నీ నామమే సర్వ శ్రేష్టమైనది ' అని అన్నారు.*

*త్యాగయ్య తొంభై ఆరు కోట్ల రామనామాన్ని జపించి, రామ సాక్షాత్కారాన్ని పొంది రామనామ కీర్తనలలోని విశిష్టతను తన కృతులలో తెలియచేసాడు.*

*ఆ పరంధాముడి ప్రభావాన్ని ఎరిగిన మానవుడు ఎంతో అదృష్టవంతుడు, అతడే భగవంతుడికి ప్రీతిపాత్రమైనవాడు.*
*అటువంటివారు రాత్రీ పగలు తమకు ప్రియమైన దైవ నామాన్నే జపిస్తూ ఉంటారు.*
*తన్మయత్వం పొందుతారు.*
*నామాన్ని జపించేటప్పుడు మనసు దృష్టి ఆ పరమాత్మ యందే లగ్నం చేసి భక్తి పారవశ్యం పొందాలి.*

*భగవంతుణ్ణి భజించడం మహా కల్పవృక్షం లాంటిది. సాయి భక్తులకు 'ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ' అత్యంత ప్రియమై నిత్య స్మరణీయమై ఉన్నది.* 

*అందువల్ల భక్తులందరూ భగవన్నామ మాధుర్యాన్ని అమృత పానంలా ఆస్వాదించి చిరంజీవులు కావాలని ఆకాంక్షిద్దాం.*

No comments:

Post a Comment