వినాయక అప్పాజీ వైద్య
సాయి మహాభక్తుడు. వినాయక అప్పాజీ వైద్య కాయస్థ ప్రభు కులమునకు చెందినవాడు. అతను బొంబాయి, అంధేరీ, వర్సోవ రోడ్డులో ఉన్న పోర్ట్ ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసులో గుమస్తాగా పని చేసేవాడు.
దాసగాణు మహారాజ్ సంకీర్తనలు వినడం ద్వారా వినాయక్ కి శిరిడి వెళ్లి బాబాని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. అతను 1912వ సంవత్సరం ఈస్టర్ పండుగ సమయంలో మొదటిసారిగా శిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆతరువాత అతను బాబా మహాసమాధి అనంతరం 1923వ సంవత్సరం నుండి తరుచు శిరిడీ వెళ్తూ ఉండేవాడు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలకు తప్పకుండా శిరిడీ వెళ్తుండేవాడు.
1923వ సంవత్సరంలో బాబా అతని భార్యకు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ భర్తకి వ్యతిరేకంగా ఒక కోర్టు కేసు రాబోతుంది, ఆ విషయంలో ఆందోళన పడకుండా దైర్యంగా ఉండమని వినాయక్ కి చెప్పు” అని చెప్పారు. బాబా చెప్పినట్టుగానే కొద్ది రోజుల్లోనే వినాయక్ కి వ్యతిరేకంగా ఒక కేసు పెట్టబడింది. కానీ బాబా దయతో వినాయక్ కి అనుకూలంగానే తీర్పు వెల్లడయ్యంది.
1926వ సంవత్సరంలో వినాయక్ తమ్ముడి 3 సంవత్సరాల కూతురు తీవ్ర జ్వరంతో కొద్ది రోజులుగా బాధ పడుతున్నది. వైద్యులు చేసే చికిత్సకు ఏమాత్రం జ్వరం తగ్గడం లేదు. జ్వరం సుమారు 105 డీగ్రీలుకు తగ్గకుండా వుంటూ ఉండింది. అందువలన అందరూ ఆ అమ్మాయి బ్రతకడం కష్టమని అనుకున్నారు. వినాయక్ ఆ అమ్మాయికి బాబా ఊదీ ఇచ్చాడు. దాని ప్రభావంతో 3-4 రోజులలోనే తను పూర్తిగా కోలుకుంది.
1927వ సంవత్సరంలో వినాయక్ భార్య క్షయ వ్యాధితో బాధపడింది. 8 నెలలుగా చికిత్స చేస్తున్నా తన ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలేమి కనపడలేదు. క్షయవ్యాధి తోపాటు జ్వరం కూడా ఆమెని బాధపెడుతూ ఉండేది. వినాయక్ తన భార్యని శిరిడీకి తీసుకొని వెళ్ళగా ఆమె జ్వరం 4 రోజులలోనే పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే వారు అంధేరీలో వారి ఇంటికి తిరిగి వచ్చేసారు. కాని 10 రోజుల తరువాత వినాయక్ భార్యకి మళ్ళీ వ్యాధి తిరగబెట్టింది. వినాయక్ తన భార్య ఆరోగ్య విషయంలో ఇంక ఆశ వదులుకొని ఆమెని వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్ళాలని అనుకున్నాడు. ఇంతలో బాబా అతని భార్యకి స్వప్న దర్శనమిచ్చి “త్వరలోనే కోలుకుంటావ”ని చెప్పారు. ఇది జరిగిన 15 రోజుల్లోనే ఆమెకు జ్వరం తగ్గి, నిదానంగా ఆరోగ్యం మెరుగుపడుతూ కొద్దిరోజులలోనే పూర్తిగా కోలుకుంది. తరువాత ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
జూన్ నెలలో ఒక గురువారం రోజున బాబా వినాయక్ భార్య ముందు ప్రత్యక్షమై తనకి ఒక పట్క(తలకి చుట్టుకునే వస్త్రం) కావాలని అడిగారు. అది తన దగ్గర లేనందున ఆమె బాబాకి కొద్దిగా బియ్యం, పప్పు దినుసులు సమర్పించుకుంది. బాబా ఆమె ఇచ్చిన భిక్ష స్వీకరించి అదృశ్యమైపోయారు. నిజానికి ఆమె బాబాని ఎప్పుడూ చూడలేదు. ఆమె తన భర్తకి ఆ వివరాలు చెప్పగా, ఆమె చెప్పిన పోలికలను బట్టి బాబాయే స్వయంగా వచ్చారని నిర్ధారణకి వచ్చాడు వినాయక్.
బాబా ఎల్లప్పుడూ తన వెనకాలే వుంటూ తనని అన్ని విధాలుగా రక్షిస్తున్నారని వినాయక్ గట్టిగా నమ్మేవాడు. ఎప్పుడే కష్టం వచ్చినా బాబా సహకారంతో అతను వాటినుండి బయటపడేవాడు.
1933వ సంవత్సరంలో వినాయక్ శిరిడీలో 20 రోజులు వునాడు. అప్పడు తరచూ స్వప్నంలో బాబా అతనికి దర్శనమిస్తూ వుండేవారు. అతను ఉదీ మహిమల అనుభవం కూడా పొందాడు. అదే సంవత్సరంలో ఒకసారి బాబా వినాయక్ కి స్వప్నంలో కనిపించారు. ఆ స్వప్నంలో బాబాకి ఒక రూపాయి దక్షిణగా వినాయక్ సమర్పించుకున్నాడు. బాబా దానిని వినాయక్ కి తిరిగి ఇచ్చేస్తూ “ఎంత కావాలి అంటే అంత తీసుకో” అని అన్నారు. మరుసటి నెలలోనే వినాయక్ అనుకోకుండా ఉద్యోగంలో పదోన్నతి పొందాడు.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:
Post a Comment