సాయిభక్తుడు శ్రీబదావే
సాయిబాబా భక్తుడు శ్రీ బదావే బ్రాహ్మణ కులస్థుడు. అతను 1906వ సంవత్సరంలో నెవాసాలోని మోహినీరాజ్ మందిరంలో పూజారిగా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డ పుట్టకముందు, పుట్టిన తర్వాత చాలామంది పిల్లలు పుట్టారు, కానీ చిన్నవయస్సులోనే వాళ్ళంతా మరణించారు. నానాసాహెబ్ చందోర్కర్ స్నేహితుడు, బదావేకు మామగారైన వబాలే అహ్మద్ నగర్ లో వకీల్ గా పనిచేస్తూ ఉండేవాడు. అతను బాబాకు గొప్ప భక్తుడు. అతని ప్రోత్సాహంతో ఒకసారి బదావే భార్యాబిడ్డలతో శిరిడీ వెళ్లాడు. బాబా దర్శనం చేసుకొని మశీదులో కూర్చున్నారు. అతను గాని, అతని భార్య గాని వారి మనోవేదనలను బాబాకు విన్నవించుకోలేదు. కానీ అతని భార్య, ఇకపై తమకు పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులై ఉండాలని మనసులోనే బాబాను ప్రార్థించింది. మరుక్షణం సర్వజ్ఞుడైన సాయిబాబా ఆమె తలపై తన చేతిని ఉంచి, ఆమెతో "ఆందోళన చెందకండి" అని చెప్పారు. ఆ తరువాత బాబా అశీస్సులతో ఆ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. వాళ్లలో ఒక అబ్బాయి 17 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు, కానీ, మిగిలిన అందరూ క్షేమంగా ఉన్నారు.
ఆ మొదటి సందర్శనలో బాబా బదావేని దక్షిణ అడిగారు. అతను కొంత మొత్తాన్ని చెల్లించాడు. తరువాత కూడా అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయేంతవరకు బాబా అతనిని మళ్ళీ మళ్ళీ దక్షిణ అడిగి తీసుకున్నారు. ఆ తరువాత కూడా బాబాకు ఇంకో రూపాయి దక్షిణ సమర్పించాలని అతను ఆశపడ్డాడు కానీ తన వద్ద ధనం లేకపోవడంతో ఇవ్వలేకపోయాడు. శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత అతడు ఆ విషయం గురించి తన భార్యకు చెప్పాడు. కొన్ని సంవత్సరాల తరువాత అంటే సుమారు 1916వ సంవత్సరంలో అతనిని ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. ఎంత కష్టపడినా చాలా కొంచెం డబ్బే సంపాదించగలిగేవాడు. ఆ సమయంలో అతని భార్య సాయిబాబాకు అతను ఇవ్వాలనుకున్న ఒక రూపాయి గురించి గుర్తుచేసింది. వెంటనే అతడు సాయిబాబాకు M.O. ద్వారా ఆ రూపాయి పంపాడు. అప్పటినుండి అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. 1914లో అతడు పూనా వెళ్లి ఎస్టేట్ బ్రోకర్ గా వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతని పిల్లలు కూడా వ్యాపారం చేసుకుంటూ మంచి స్థితిలో ఉన్నారు.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:
Post a Comment