Tuesday, June 16, 2020

సాయిభక్తుడు భాగ్ చంద్ మార్వాడీ

సాయిభక్తుడు భాగ్ చంద్ మార్వాడీ


భక్తుల వద్ద ఉన్న ధనమంతా అయిపోయేవరకు బాబా భక్తులను దక్షిణ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాలలో భక్తులను భాగ్ చంద్ మార్వాడీని అడిగి దక్షిణ తీసుకొని రమ్మని బాబా తరచుగా చెప్పేవారు. భాగ్ చంద్ మార్వాడీ శిరిడీలో ఒక కిరాణా దుకాణాదారుడు. 

ఒకసారి ఒక వ్యక్తి బాబా దగ్గరకు వచ్చి, "బ్రహ్మము యొక్క స్వభావం ఏమిటి?" అని అడిగాడు. అందుకు సమాధానంగా భాగ్ చంద్ మర్వాడీని అడిగి 100 రూపాయలు దక్షిణగా సమర్పించమన్నారు బాబా. భాగ్ చంద్ మార్వాడీ డబ్బు ఇవ్వడానికి బదులు తన నమస్కారాలే బాబాకు సమర్పించమని చెప్పాడు. అదే విషయం ఆ వ్యక్తి బాబాకు చెప్పగా బాబా ఆ వ్యక్తిని దక్షిణ తీసుకురావటానికి వేరొక స్థలానికి పంపించారు. వాళ్ళు కూడా అలానే బదులుచెప్పారు. అందువలన అక్కడనుండి కూడా ఆ వ్యక్తి ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చాడు. చివరిగా బాబా నానాసాహెబ్ చాందోర్కర్ ను భాగ్ చంద్ మార్వాడీ వద్ద నుండి 100 రూపాయలు తెమ్మని చెప్పారు. నానాసాహెబ్ స్వయంగా వెళ్ళకుండా భాగ్ చంద్ మార్వాడీకి ఒక చీటీ వ్రాసి పంపాడు. అది అందిన వెంటనే 100 రూపాయలు పంపించాడు భాగ్ చంద్ మార్వాడీ. అప్పడు బాబా, "ఈ ప్రపంచంలో అంతా ఇలానే ఉంటుంది" అన్నారు.

జరిగినదంతా గమనిస్తున్న ఆ వ్యక్తికి అందులోని అంతరార్థం ఏమిటో తెలియక దాసగణు మహరాజ్ ని వివరం అడిగాడు. అప్పుడు దాసగణు, "చూసావా? ఇతరులు డబ్బు అడిగినప్పుడు వారు దాన్ని పొందలేకపోయారు. కానీ నానాసాహెబ్ చీటీ పంపిన వెంటనే డబ్బు లభించింది. దేనినైనా అడిగే ముందు ఆ వ్యక్తి అందుకు అర్హుడై ఉండాలి. బ్రహ్మమంటే ఏమిటో తెలుసుకోవాలని కోరుకునే వ్యక్తి కూడా అందుకు తగిన ఉత్సుకత కలిగి ఉండాలి. అప్పుడే అతడు దానిని పొందగలడు - ఉద్యోగి, సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు" అని వివరించారు.

పంచేద్రియాలు మహాత్ముల నియంత్రణలో ఉంటాయి. బాబా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని నిరూపించారు. ఒకసారి భాగ్ చంద్ మార్వాడీతో బాబా, "వెళ్ళు! పరుగున వెళ్ళు! నీ గడ్డివాముకి నిప్పు అంటుకుంది" అన్నారు. వెంటనే భాగ్ చాంద్ మార్వాడీ వెళ్లి చూస్తే నిజంగానే తన గడ్డివాముకి నిప్పు అంటుకొని ఉంది. ఇంతలో బాబా కూడా స్వయంగా అచ్చటికి చేరుకొని, తమ చేతులతో కొన్ని సైగలు చేసారు. దానితో నిప్పు ఆరిపోయింది.

ఆరోజు సాయంత్రం నానాసాహెబ్ చందోర్కర్, మరికొంతమంది భక్తులు బాబా దర్శనార్ధం మశీదుకు వచ్చారు. నానా వెళ్లి బాబాకు నమస్కరించుకున్నాడు. అప్పుడు బాబా, "నానా! కొంతమంది ఎంత స్వార్థపూరితమైనవారో చూసావా? నేను అతనిని అప్రమత్తం చేయడమే కాకుండా, స్వయంగా వెళ్లి అతని గడ్డివాముకి అంటుకున్న నిప్పును ఆర్పివేశాను. కానీ, అతడు ఇంకనూ, "నాదొక గడ్డివాము ధ్వంసం అయిపోయింది, నేను నష్టానికి గురయ్యాను" అని నన్ను నిందిస్తున్నాడు. లాభనష్టాలు, చావుపుట్టుకలు దైవాధీనాలు. ఈ విషయాన్ని ప్రజలు ఎలా మరచిపోతారు? 'ఇది నాది - అది నాది' అని చెప్పడంలో ఏమిటి అర్ధం? ఆ గడ్డివాము మర్వాడీదని ఎలా చెప్పవచ్చు? అది గడ్డేకాని అతని శరీరం కూడా కాదు కదా! వాస్తవానికి అది ఎండిన గడ్డికి చెందినది. అది విత్తనాల నుండి సృష్టించబడింది. విత్తనాలు నేలలో నాటుకుంటాయి, మేఘాల నుండి నీరు వచ్చింది, సూర్యరశ్మి వలన పెరిగి పెద్దవయ్యాయి(భూమి, వర్షం, ఎండల వలన ఆ విత్తనాలు నేలలో నాటుకొని ఎదిగాయి). ఈ మూడు ఆ ఎండుగడ్డి యొక్క నిజమైన యజమానులు. మరి ఈ వ్యక్తి తానే యజమానినని చెప్పుకుంటున్నాడు. నానా! కనీసం నువ్వైనా అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించు. ఇంతకుముందెప్పుడూ తనది కాని దానిని తనదిగా భావించి అనవసరంగా నష్టం గురించి శోకిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరో చేతితో తీసుకుంటాడు. అందుకే, మనం ఆనందం, బాధలను అనుభవిస్తున్నాము. కానీ, అతను ఇది గ్రహించటం లేదు. ఇది అతని అజ్ఞానం కాదా?" అని అన్నారు. తరువాత బాబా మార్వాడీ వైపు తిరిగి, "శేట్, వెళ్ళు! ఊదీ తీసుకొని ఇంటికి వెళ్లి ప్రశాంతంగా కూర్చో! కొన్ని ఇతర వాణిజ్య లావాదేవీలలో నీవు డబ్బు సంపాదిస్తావు. దానితో నీ నష్టం పూడుకుంటుంది. చింతించకు" అన్నారు.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment