Sunday, December 6, 2020

దత్తాత్రేయ షోడశ అవతారాలు 10 వది మాయాయుక్తావధూత ::

 శ్రీ దత్త లీలా క్షేత్ర మహత్యం...


షోడశ అవతారాలలో 10 వది

మాయాయుక్తావధూత :: 🙏🏻🙏🏻

సంస్కృతం:శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

దత్తాత్రేయ ప్రభు తన భక్తుడిని పరీక్షించడానికి వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం ,స్వాతి నక్షత్రంలో భిక్షు రూపంలో మధ్యాహ్న సమయంలో శీలుడు అనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు.

మాధవస్య చతుర్దశ్యాం  శుక్లాయాం బుధవాసరే!

స్వాత్ర్యు క్షయుక్తే మాధ్యాహ్నే వ్యక్త:స లోకపావన!!

భక్తుల హృదయంలో ప్రేమ, విశ్వాసం మరియు పవిత్ర సంకల్పములను చూడడానికి దత్తాత్రేయ స్వామి సంపన్నుడు అయిన శీలుడు అనే బ్రాహ్మణ ఇంట్లో శ్రార్ధకర్మ సమయంలో సన్యాస వేష ధారణలో అకస్మాత్తుగా ప్రకటం అయ్యారు. కౌపీనధారి, విశాలమైన, తేజోవంతుమైన కన్నులతో, ద్విబహు, శరీరం బంగారు తేజస్సుతో వెలిగిపోతూ, రెండు చేతులు మోకాళ్లను దాటి పొడవుగా, గొంతుకు రుద్రాక్ష మాల, కుడి చేతిలో భిక్షాపాత్ర,ఎడమచేతిలో దండం,శరీరం అంతా చందన మరియు విభూది మిశ్రమ  సుగంధములతో, శోభిలుతున్నారు. పక్కనే ఒక నల్ల కుక్క కూడా ఉంది. అలా ఆ అద్వితీయ మూర్తి అకస్మాత్తుగా వచ్చి ఇంట్లో పీట మీద కూర్చున్నారు. ఆ అవధూతను చూసి, ఆ శీలుడు కఠిన శబ్దములు వాడి అగౌరవ పరిచారు.

దత్తాత్రేయ స్వామి దానికి సమాధానం గా నేను అప్రతీత,నిరాకార,అగోచర, అనంత నామాలతో పిలవబడుతూ, విశ్వవ్యాప్తి చెందిన అవధూతను అని తెలిపారు. ఆ శీలుడు స్వామి సమాధానం తో తృప్తి చెంది, మీ ఆశ్రమం ఏమిటి?మీ శాఖ ఏమిటి?మీరు ఎవరు? మీ ఆరాధన ఏమిటి?అని అడిగారు. దత్తాత్రేయ స్వామి నాకు ఏ ఆశ్రమం వర్తించదు, నేనే అందరికి ఆశ్రయ స్థానం.నాకు ప్రభువు అంటూ ఎవరు లేరు, ఈ ముల్లోకాలకు, ప్రపంచానికి నేనే ప్రభువును, అన్నారు. అది విన్న శీలుడు తన గురువు వారే అని గుర్తించారు. స్వామిని పూలు,పంచామృతములతో పూజించి, తాంబూలం ఇచ్చి సాష్టాంగ  నమస్కారం చేశాడు.

శ్రార్ధకర్మకు వచ్చిన మిగతవారు కలత చెంది కోపంతో దత్తాత్రేయ స్వామిని దుర్భాషలాడారు. హే దుష్టుడా!నువ్వు వర్ణ హీనుడవు, భ్రస్టుడువు. బ్రహ్మకర్మని భ్రష్టం చేశారు అని అన్నారు.

 ఓంకారమే బ్రహ్మము,అక్షర పరబ్రహ్మ స్వరూపమే వేదం,నీకు వేదములు శ్రవణం చేయడము అర్హత లేదు అని అరిచారు. భిక్షకుని వేషంలో ఉన్న దత్తాత్రేయ స్వామి నాకు వేదములు తెలియదు, కానీ నేను సర్వ సృష్టి,పోషణ,లయం నా నుంచే జరుగుతుంది, బ్రహ్మకర్మ అంటే తెలియదు,కానీ ఓం కారం నా నుంచే జనించినది. సుగుణ మైన నిత్య వేద కర్మలకు నేనే అర్హుడను. నేను మాయా రహితుడు. నాకు ఏమి తెలియక పోయినా నా కుక్కకు చక్కగా 4 వేదాలు వచ్చు,బాగా ప్రావీణ్యం వుంది. అది మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది. అనగానే స్వామితో ఉన్న కుక్క వెంటనే 4 వేదాలు, శాస్త్రాలు గురించి వివరంగా చెప్పింది. ఇది విని అక్కడివారు ఆశ్చర్యపోయారు. పితృలోకం నుంచి ఆ బ్రాహ్మణుడు తల్లిదండ్రులు భూమి మీదకు వచ్చారు. దత్తాత్రేయ ప్రభువు తన అద్వితీయ శక్తితో అందరికి గర్వభంగం చేసి, వారి అందరికి దీక్ష ఇచ్చి, తత్త్వశాస్త్రం ఉపదేశం ఇచ్చారు. తరువాత అందరూ దత్తాత్రేయ స్వామి ని ప్రార్ధించారు. ఈయనను మూడు కార్యాలు పెరుగు, అన్నం తో పూజించాలి. 

జై గురు దత్త.

శ్లో య॥ మాయాయుక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయ తే | శుద్ధబుద్ధాత్మరూపాయ నమోస్తు పరమాత్మనే॥

No comments:

Post a Comment