*యోగీశ్వరులారా ఋషులారా ! హరిభక్తులారా భవబంధాలు నశింపచేసే నా మాట వినండి.*
*శ్రీరాముడే పరబ్రహ్మం.*
*శ్రీరాముడే పరమ తపస్సు, శ్రీరాముడే పరమ తత్వం.*
*శ్రీరాముడే తారక బ్రహ్మం అని ఎరుగుదురుగాక ! అని రామ రహస్యోపనిషత్ చెబుతుంది.*
*భగవంతుడి నామ, రూప, గుణ, ప్రభావ, లీలా, తత్వ రహస్యాదులను సంబంధించిన అమృతమయ గాధలను విని, మననం చేసుకుని, మేను మరచి భగవంతుని స్వరూపంలో లీనమై వర్తించడం స్మరణ భక్తి స్వరూపంగా చెబుతారు.*
*భగవన్నామాన్ని నిత్యం మనసులో స్మరించడం వల్ల, పాపాలు నశిస్తాయని, దుఃఖాలు దరిచేరవని విశ్వసిస్తారు.*
*కాశీలో మృత్యు కాలంలో శివుడు ప్రాణిచెవులో "రామ రామ రామ " అని ఎవరి పవిత్ర నామం ఉపదేశిస్తున్నాడో, ఆ తారక బ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ శ్రీరాముని నేను ఆశ్రయిస్తున్నాను, అని శ్రీరామ భుజంగ ప్రయాతా స్తోత్రం అంటుంది.*
*రామ మంత్రాన్ని తారక మంత్రమంటారు.*
*తారకమంటే తరింపచెసేదని అర్థం.*
*అది మనిషిని తరింపచేసేది, ముక్తినిచ్చేది.*
*ఒక అడవిలో కొందరు దొంగలు తాము చేద్దామనుకున్న దొంగతనాన్ని గూర్చి మాట్లాడుకుంటూనే ముక్తి పొందారని ఒక చాటు శ్లోకం చెబుతుంది.*
*తెలియకుండానే వాళ్లు తమ సంభాషణలో ప్రతిమాటలో రామ నామం స్మరించారు.*
*"వనేచరామః "అనుకున్నారు.*
*అంటే అడవిలో సంచరిద్దాము, నివసిద్దాం అని అర్థం.*
*అనుకోకుండానే "రామ "పదం పలికారు వాళ్లు.*
*ఆ తరువాత "వాసుబారామః " అని అన్నారు.*
*వసు అంటే బంగారం.*
*దారినపోయే బాటసారుల నుంచి బంగారాన్ని, ధనాన్ని దొంగిలిద్దామని వారి అలోచన.*
*ఈ మాటలలో కూడా "రామ" పదం ఉన్నది.*
*ఆ తరువాత "నదీస్త రామః " అంటే దొంగిలించాక నదిని దాటేద్దాం అని అనుకున్నారు.*
*ఇందులోను "రామ " పదం దాగిఉంది.*
*ఆపిమ్మట "నభయం స్మరామః " అనుకున్నారు.*
*నదిని దాటితే పట్టుబడతామన్న భయం ఉండదని వారి మాటల భావము.*
*ఇందులోనూ రామ నామం ఉంది.*
*చివరగా ఆ శ్లోకంలో " వనే కిరాత ముక్తి గతాః సంగాతె " అని వుంది.*
*ఆ అడవిలో దొంగలు మరణించాక ముక్తిని పొందారట.*
*రామనామాన్ని విడిగా కాకపోయినా ఇతర పదాలతో కలపి ఉచ్చరించిన మాత్రాన ఆ దొంగలకు ముక్తి లభించింది.*
*మరి భక్తి శ్రద్దలతో రామనామ స్మరణ చేస్తే ఇంకెంత ప్రయోజనం ఉంటుంది. రామనామ మొక్కటే తారక మంత్రమైనది.*
No comments:
Post a Comment