*సాయిబాబా వేదాంతాన్ని, భక్తిని, అధ్యాత్మిక క్రమశిక్షణను, నీతిని, దైనందిన ప్రవర్తన, సర్వప్రాణుల సమభావనను బోధించారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు.*
*సాయిబాబా మాటలకు కాలదోషం పట్టదు. కాలదోషము పట్టని కమనీయ సూక్తులు, అంటారు పెద్దలు.*
*సాయిబాబా ఒకసారి " నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, వస్త్రముల లేనివారికి వస్త్రములు ఇచ్చినచో, నీ వసారా ఇతరులు కూర్చునుటకు ఇచ్చినచో భగవంతుడు మిక్కిలి ప్రీతిచెందును " అని పలికారు.*
*ఒకసారి మహారాష్ట్రకు చెందిన సత్పురుషుడైన ఏకనాథ మహారాజ్ కాశీకి వెళ్లారు.*
*ఒక కమండములో గంగా జలాన్ని తీసుకుని, రామేశ్వరంలోని శివుణ్ణి అభిషేకిద్దామని తద్వరా సంపూర్ణ కాశీయాత్ర ఫలం సిద్ధిస్తుందని భావించాడు.*
*కాశీనుండి తిరుగుప్రయాణం సాగించాడు. అది మంచి ఎండాకాలం. మార్గ మధ్యములో ఎండలు మండిపోతున్నాయి.*
*ఎక్కడా ఒక పచ్చని చెట్టుగాని, చల్లని నీడగాని లేని ఒక ఎడారిలాంటి ప్రదేశములొ శిష్యులతో కలసి ఏకనాధుడు ప్రయాణం సాగిస్తున్నాడు.*
*అటువంటి వాతావరణములో ఒక చోట కృశించిపోయిన ఒక గాడిద మూలుగు విన్నాడు. అది దాహముతో విలవిల కొట్టుకొంటున్నది.*
*ఆ గాడిద దయనీయ పరిస్తితి చూశాడు ఏకనాధుడు. ఆ పరిస్థితికి చలించిపోయాడు.*
*వెంటనే తాము రామేశ్వరములో శివునికి అభిషేకం చేయాలని తీసుకు వెళుతున్న ఆ గంగా జలాన్ని ఆ గాడిద నోటిలో పోశాడు.*
*"అదేమీ స్వామీ ! కాశీనుండి ఇంతవరకు గంగా జలము ఎంతో కష్టపడి తెచ్చాము. మనం ఆ నీటిని రామేశ్వరము వెళ్ళి ఆ నీటిని కలపాలి గదా !*
*ఇప్పుడు రామేశ్వరునికి ఏది అర్పించాలి ?" శిష్యులు అడిగారు.*
*"ఈ గాడిదయే నాకు రామేశ్వరము " అని అన్నాడు ఏకనాధుడు.*
*ఏకనాధుడు రామేశ్వరము చేరకుండానే యాత్రా ఫలం సిద్దించినది.*
No comments:
Post a Comment